You can edit almost every page by Creating an account and confirming your email.

Marpu Padmanabham

From EverybodyWiki Bios & Wiki

సర్ధార్ కామ్రెడ్ మార్పు పద్మనాభం స్వాతంత్ర్య సమరయోధులు మరియు కమ్యూనిస్టు ఉద్యమ నేత.

జీవిత విశేషాలు..........

ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. ఆయన మార్చి 5 1896 న శ్రీకాకుళం జిల్లా లోని మందస మండలానికి చెందిన భిన్నళ మదనాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమ కాలంలో మందస ఎస్టేట్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షునిగా, జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాలో జరిగిన పలు ఉద్యమాల్లో అగ్రభాగాన నిలిచారు. గాంధీజీ పిలుపు మేరకు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆనాడు ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు జరిగిన రైతు రక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కారణంగా ఆయనకు బ్రిటిష్ వారు రెండున్నరేళ్ళు జైలు శిక్ష విధించారు. 1940 లో జరిగిన పలాసలో జరిగిన చరిత్ర ప్రసిద్ధి గాంచిన అయిదో అఖిల భారత కిసాన్ మహాసభల నిర్వాహకుల్లో ఆయన ముఖ్యులు. ఈ సభలో జమీందారుల దిష్టి బొమ్మల్ని తగులబెట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గుడారిరాజమణిపురంలో బ్రిటిష్ ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపింది. వీరగున్నమ్మతోపాటు నలుగురు రైతు నాయకులు మృతి చెందారు. ఇందులో పద్మనాభం ప్రత్యక్షంగా పాల్గొని బ్రిటిష్ పోలీసులకు ఎదురొడ్డి ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. జమీందార్లు ఈయనపై కసితో పెట్టిన కేసుల ఫలితంగా రెండున్నరేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. గుడారి రాజమణిపురం కాల్పుల తరువాత ఆయన గానుగుల తరుణాచారి, బెందాళం గవరయ్య వంటి రైతు సంఘ నాయకులు శ్రామిక రాజ్య దృక్పథాన్ని అనుసరించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మరలా జైలు శిక్ష అనుభవించాడు. బళ్ళారి జైలులోనే ఆయన కమ్యూనిస్టు ఉద్యమాలపై ఆకర్షితులయ్యారు. మందస కాల్పుల సంఘటన తరువాత ఆయనను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సర్దార్ బిరుదు ఇచ్చి సత్కరించింది. 1944లో జైలు నిర్బంధం నుంచి బయటికి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రలో అరుణ పతాక ఆశయాలను ప్రచారం చేసి కట్టుబడిన తొలితరం కమ్యూనిస్టుగా ఆయన చరిత్రలో నిలిచారు.[1]

లక్ష్యసిద్ధికి పోరాటంసవరించు

తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో పద్మనాభం భార్య వియోగాన్ని పొందినా ఆ పోరాట స్ఫూర్తితో 1947-48లో జమీందారీ వ్యవస్థ రద్దును కోరుతూ పోరాటం చేశారు. దాంతో అప్పటి భారత ప్రభుత్వం 1948 జూన్ లో అరెస్టు చేసి కడలూరు జైలులో నిర్బంధించింది, "శత్రు శిబిరంలోనైనా ఉగ్ర నరసింహుడ్నే" అని రుజువు చేస్తూ 1949లో రాజకీయ ఖైదీల హక్కుల కోసం జైలు అధికారులతో పోరాటం చేసిన ధీరుడు పద్మనాభం. పోలీసులు తీవ్ర చిత్రహింసల వల్ల క్షయ వ్యాధిగ్రస్తుడై కడలూరు జైలునుంచి 1951 ఫిబ్రవరిలో విడుదలయ్యాడు, కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం మేరకు 1952, 55 సంవత్సరాల్లో సోంపేట నుంచి శాసనసభకి పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1953లో టెక్కలిలో సత్యాగ్రహం 19 రోజులు నడిపి విజయాన్ని సాధించారు.

రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆర్థికంగా అవస్థపడుతున్నా చలించలేదు. శ్రీకాకుళం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు. కడలూరు జైలు డిటెన్యూలు చందాలు వసూలుచేసి తనకి రూ.500 పంపిస్తే ఆ డబ్బును పార్టీ నిధికి అప్పగించిన నిస్వార్థపరుడు. ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి కోట్లాది శ్రమ జీవుల బాగుకోసం ఉద్యమించిన కార్యదీక్షాపరుడు పద్మనాభం. నేటితరం హృదయాల్లో '"సర్దార్ మార్పు పద్మనాభం తాత"గా చెరగని ముద్ర వేసిన రైతాంగ ఉద్యమ మార్గదర్శి మార్పు పద్మనాభం. 1920లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటినుంచి తన తుదిశ్వాస విడిచే వరకు ప్రజా ఉద్యమాల్లో నిజాయితీగా నిలబడాడు. చివరికి 1986 జనవరి 14న 'సంక్రాంతి' పర్వదినాన తన జన్మస్థలమైన భిన్నళ మదనాపురంలో అమరత్వం పొందారు. నమ్మిన సిద్ధాంతం పట్ల విశ్వాసం, నిర్బంధాన్ని లక్ష్యపెట్టని ధైర్యం, నిస్వార్థం, కార్యదీక్ష, పట్టుదల, నిజాయితీ మార్పు పద్మనాభానికి మిగిలిన ఆస్తి.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి మార్పు పద్మనాభం గారి దగ్గరకు ఆయన స్వగ్రామం దరినున్న హారిపురంనకు స్వయంగా వచ్చి పద్మనాభం గారిని తన మంత్రి వర్గం లో చేరమని ఆహ్వానించగా తాను కాంగ్రెస్ ను వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేరేనని ప్రకాశం పంతులుగారి విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు.

వందల ఎకరాల భూస్వామి అయినప్పటికీ కూడా తన యావదాస్తిని స్వాతంత్ర్య ఉద్యమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం శ్రామిక జీవుల కోసం ధారబోసిన మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహానాయకుడు సర్ధార్ కామ్రెడ్ మార్పు పద్మనాభం గారు. అలాగే ఆయన అనుచరులైన స్వాతంత్ర్య సమరయోధులైన గానుగుల తరుణాచారి మరియు బెందాళం గవరయ్య గార్లు తమ జీవిత చరమాంకంలో పేదరికాన్ని చూశారేగాని స్వాతంత్ర్య సమరయోధులమని స్వార్థ ప్రయోజనాలను ఏనాడూ ఆశించని మహానుభావులందరికి వందనాలు.

References

Taken from the book written on the history of SARDAR Marpu Padmanabham - "MARPU KOSAM".

"SARDAR" COMRADE MARPU PADMANABHAM


This article "Marpu Padmanabham" is from Wikipedia. The list of its authors can be seen in its historical and/or the page Edithistory:Marpu Padmanabham. Articles copied from Draft Namespace on Wikipedia could be seen on the Draft Namespace of Wikipedia and not main one.